Mana Mahati News - తెలంగాణ / Mana mahati news : *గుండెల్ని పిండేసే విషాదం.. ఇద్దరు చిన్నారుల హత్య, తండ్రి ఆత్మహత్యాయత్నం* నారాయణపేట జిల్లా మరికల్ మండలం తేలేరు గ్రామంలో చోటుచేసుకున్న అమానవీయ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. కన్నతండ్రే తన ఇద్దరు చిన్నారుల ప్రాణాలు తీసిన ఈ విషాద సంఘటన గ్రామాన్ని శోకసంద్రంలో ముంచింది. గ్రామస్తుల కథనం ప్రకారం.. శివరాం అనే వ్యక్తి తన పిల్లలు రిత్విక్, చైతన్యలు అనారోగ్యంతో ఉన్నారని చెప్పి అర్ధరాత్రి ఇంటి నుంచి బయటకు తీసుకెళ్లాడు. ఆసుపత్రికి తీసుకెళ్తున్నానని నమ్మించిన శివరాం, వారిని పొలాల వద్దకు తీసుకెళ్లి అక్కడే ఉరివేసి హత్య చేసినట్లు సమాచారం. అనంతరం చిన్నారుల మృతదేహాలను సమీప కాలువలో పడేశాడు. ఈ ఘోరానికి పాల్పడిన అనంతరం శివరాం పురుగుల మందు తాగి, ట్రాన్స్ఫార్మర్ను పట్టుకుని ఆత్మహత్యకు యత్నించాడు. అతడి పరిస్థితి విషమంగా మారడంతో స్థానికులు గుర్తించి వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడు చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల శివరాంకు భార్యతో విడాకులు జరిగినట్లు సమాచారం. కుటుంబ కలహాలు, మానసిక ఒత్తిడే ఈ దారుణానికి కారణమై ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. ఈ అమానవీయ ఘటనతో తేలేరు గ్రామంలో తీవ్ర విషాద వాతావరణం నెలకొంది. చిన్నారుల మృతి ప్రతి హృదయాన్ని కలిచివేస్తుండగా, ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా సమాజం ఆలోచించాల్సిన అవసరం ఉందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
Admin
Mana Mahati News